ఊరింపే... ఊరటలేదు
బొబ్బిలి : నైరుతి ప్రవేశించింది. తొలకరి పలకరించింది. రోజూ కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఇక వాన కుమ్మరించేస్తుందని అనుకునేంతలోనే వెనక్కి మళ్లిపోతోంది. నారుమడులకు సిద్ధం చేసుకున్న రైతులు, వర్షం వస్తే దుక్కులు దున్నుదామనుకున్న కర్షకుడు ఏ పనీ చేయలేకపోతున్నాడు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన విత్తనాలు తీసుకెళ్లినా ఆశించిన రీతిలో వర్షం జాడ లేకపోవడంతో ఏం చేయాలో పాలు పోక కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం కురుస్తున్న అరకొర వానలతో జిల్లాలోని జలాశయాలకు మేలు కలగడంలేదు. తగినంత స్థాయిలో నీరు చేరడం లేదు. ఇక రానున్న రోజుల్లో వరి ఉభాల సమయానికైనా నీరు పొలాల్లోకి వస్తుందా అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
జలకళను సంతరించుకోని ప్రాజెక్టులు
జిల్లాలో 2 లక్షల 79 వేల 991 ఎకరాల ఆయకట్టుకు 9183 చెరువుల నుంచి సాగునీరు అందుతుంది. వీటిలో సుమారు 17 వేల 490 ఎంసీఎఫ్టీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వీటిలోకి నీరు చేరాలంటే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రధాన ప్రాజెక్టులే ఆధారం. కానీ కురుస్తున్న వర్షాలు జలాశయాల్లోకి నీరుచేర్చేంతగా ఉండట్లేదు. గత ఏడాది ఇదే సమయానికి జలాశయాల్లో చేరిన నీటితో పోలిస్తే ఈ ఏడాది నీరు తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.