పార్టీ మారుతున్నారనేది దుష్ర్పచారం

పార్టీ మారుతున్నారనేది దుష్ర్పచారం - Sakshi


 తెలంగాణలో టీడీపీ

పరిస్థితిని కప్పి పుచ్చుకునేందుకే డ్రామాలు

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య




నెల్లూరు: ‘తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు రోజుకొకరు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్, ప్రకాష్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ విషయాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారు’ అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టం చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేనైన తనపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలంటే సీఎం చంద్రబాబుకు చులకనని, అందుకే ఆ సామాజికవర్గాన్ని కించపరచేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. తానెప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు.



మరోసారి తనపై ఇలాంటి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేస్తే అందుకు సంబంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. వారు చేస్తున్న ప్రచారాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని పలుమార్లు రుజువైందని తెలిపారు. అదేవిధంగా నేడు కూడా ఎల్లో మీడియా ద్వారా వార్తలు రాయించి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఇటువంటి తప్పుడు రాతలు రాయించవద్దని కోరారు. చంద్రబాబును కాపాడేందుకు అబద్ధపు రాతలు రాసి పత్రిక, మీడియా పరువును బజార్లో పెట్టుకోవద్దని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top