ట్రాఫిక్ ఏఎస్సైపై డిప్యూటీ మేయర్ దాడి


నిజామాబాద్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఏఎస్సైపై నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేయర్ ఫయిమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో నాగం రవీందర్ తెలిపిన వివరాలివీ.. నగర ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా నగర డిప్యూటీ మేయర్ ఫయీం కుమారుడు బషీర్ అదునన్, అతని స్నేహితుడు బైక్‌పై అటువైపు వచ్చారు. ట్రాఫిక్ ఏఎసై శ్యాంకుమార్ వారిని ఆపి బైక్ కాగితాలను చూపించాలని అడిగారు. దానికి వారు అది డిప్యూటీ మేయర్‌కు సంబంధించి బైక్ అని బదులిచ్చారు. అయినా సరే కాగితాలు చూపించాలని అనటంతో వారు గొడవకు దిగారు. ఆయన్ను దూషించారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సైలు నరేష్, టాటాబాబు సముదాయించినా ఆగలేదు. బైక్‌కు నంబర్, టీఆర్ రిజిస్ట్రేషన్ లేక పోవటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.



విషయం తెలిసి అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్ ఆగ్రహంతో ఏఎస్సై శ్యాంకుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. ఏఎసై షర్ట్ పట్టుకుని పక్కకు నెట్టివేయటంతో బటన్ ఊడింది. ట్రాఫిక్ ఎస్సైలు డిప్యూటీ మేయర్‌ను సముదాయించగా వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బైక్‌పై వచ్చిన వారిని తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. అనంతరం ఏఎసై శ్యాంకుమార్ ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్వో రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్‌పై సెక్షన్ 353, బైక్‌పై వచ్చిన వారిపై రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top