14 మండలాలతో జిల్లానా?

విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు - Sakshi


    బీజేపీ మజ్దూర్‌ మోర్చా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌



మెదక్‌: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన మెదక్‌ జిల్లాను కేవలం 14మండలాలకే పరిమితం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను నిరాశకు గురిచేశారని బిజేపీ జిల్లా మజ్దూర్‌ మోర్చా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 14 మండలాలు, ఒక మున్సిపాలిటీతో జిల్లాను ఏర్పాటు చేయడం ఏమిటన్నారు.



రెవెన్యూ డివిజన్‌ 18మండలాలు ఉండగా, మెదక్‌జిల్లా 14మండలాలకే పరిమితమా.. అని ఆయన  ప్రశ్నించారు. జిల్లా ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ చేసిందేముందని ఆయన ప్రశ్నించారు. నర్సాపూర్, ఆందోల్, నారాయణఖేడ్‌ మండలాలను మెదక్‌ జిల్లాలోకలిపితేనే ఒక స్వరూపం వస్తుందన్నారు.



ఈ విషయంలో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నర్సాపూర్, ఆందోల్, నారాయణఖేడ్, నాగిరెడ్డిపేట మండలాలతోపాటు హవేళి ఘణపూర్‌ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసి మెదక్‌జిల్లాలో కలపాలని డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో  ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో బిజేపీ నాయకులు సుభాష్‌ చంద్రాగౌడ్, వెల్ముల సిద్దిరాంలు, వడ్ల జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top