వివాహమైన మూడు నెలలకే..
♦ యువకుడి బలవన్మరణం
♦ భార్య తరచూ పుట్టింటికి వెళ్లడమే కారణం
కోల్సిటీ(రామగుండం) : గోదావరిఖనిలో పెళ్లయిన మూడు నెలలకే దూస అనిల్కుమార్(30) అనే యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి సంపత్, వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖని జ్యోతినగర్ సమీపంలోని కృష్ణానగర్కు చెందిన సంపత్ అనే ఆర్టీసీ డ్రైవర్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దూస అనిల్కుమార్ ఎంసీఏ చదివాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీ బ్యాంక్లోని రుణాలు మంజూరు చేసే విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం మానకొండూర్ మండల ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది.
ఆషాఢం రావడంతో నెల రోజులు పుట్టింటికి వెళ్లి వచ్చింది. ఆరోగ్యం బాలేదని మరో 15 రోజులు పుట్టింటికి వెళ్లింది. సున్నిత మనస్తత్వం కలిగిన అనిల్కుమార్.. తన భార్య తనతో సరిగా ఉండడం లేదని, తరచూ పుట్టింటికి వెళ్తోందని మానసిక ఆవేదనకు లోనయ్యాడు. బతుకమ్మ పండగ సందర్భంగా ఈనెల 18న అతడి భార్యను ఆమె తల్లి పుట్టింటికి తీసుకుపోయింది. 19న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలిస్తుండగా.. పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతిచెందాడు. బుధవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్బాబు తెలిపారు.