భార్యను కడతేర్చిన భర్త
-
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
రాజమహేంద్రవరం క్రైం :
వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త భార్యను ఉరి వేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం తుమ్మలావ, సాంబశివరావుపేట, 1వ వీధిలో అద్దెకు ఉంటున్న కార్పెంటర్ నీలి శ్రీనివాసరావు తన భార్య నీలి వెంకట లక్ష్మిని (50) గురువారం ఉదయం నైలాన్ తాడుతో ఉరి వేసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అనంతరం అతను చిన్న కుమారుడు నీలి రవి కుమార్కు ఫోన్ చేసి మీ అమ్మ, నేను ఒక ఫంక్షన్కు వెళ్తున్నాము. నీవు బయట భోజనం చేసేయి అని చెప్పాడు. అతను రాత్రి 11 గంటలకు వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తండ్రి సెల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆదే ప్రాంతంలో ఉంటున్న తన పిన్ని జయలక్ష్మి ఇంటికి వెళ్లి రవికుమార్ నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జయలక్షి ్మ, ఇతరులను వెంటపెట్టుకొని రవికుమార్ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం వేసి ఉంది. తండ్రి సెల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చేసేది లేక ఇంటి తలుపులను రాడ్తో పగుల గొట్టి తెరిచేసరికి తల్లి వెంకట లక్ష్మి కిందపడి మరణించి ఉంది. తాడుతో ఆమెకు ఉరి వేసి హత్య చేసినట్టు ఆతను గుర్తించాడు. వెంటనే స్ధానికుల సహాయంతో త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. త్రీ టౌన్ ఇన్చార్జి సీఐ ముక్తేశ్వరరావు అక్కడకు చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నీలి రవి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమా?
నీలి శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం కావడంతో అతను వేరే కాపురం ఉంటున్నాడు. చిన్న కుమారుడు రవి కుమార్ తుమ్మలావలోని ఊడల వెంకన్న ఉడ్ డిజైన్ వర్క్సులో డిజైనర్గా పని చేస్తున్నాడు. అతను తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. శ్రీనివాసరావుకు పెదపూడి గ్రామానికి చెందిన కోటమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో భార్యా భర్తలు తరచూ గొడవ పడుతున్నారు. ఈ విషయం పిల్లలకు కూడా తెలుసు. గురువారం ఉదయం యథావిధిగా రవి కుమార్ పనికి వెళ్లిపోయాక భార్యా భర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. వెంకట లక్ష్మి ప్రార్థన చేసుకుంటుండగా వెనుక నుంచి శ్రీనివాసరావు నైలాన్ తాడుతో ఉరి వేసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని పైకి వేలాడదీసే క్రమంలో కుదరకపోవడంతో మృతదేహాన్ని కింద వదిలివేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతను వర్కు షాపు వద్దకు మద్యం సేవించి వచ్చి తనకు ఈ రోజు ఆఖరు రోజు అని, తాను గోదావరిలోకి దూకి చనిపోతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడని షాపు వారు చెప్పారు. అయితే శ్రీనివాసరావు ఎక్కడకు వెళ్లాడో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను హత్య చేసి అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన తుమ్మలావ కు చెందిన నీలి శ్రీనివాసరావు ను పోలీసుల అదుపులో ఉన్నాడు. శ్రీనివాసరావు శుక్రవారం కంబాల చెరువు ప్రాంతంలో మద్యంలో మైలుతుత్తం కలుపుకొని తాగి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆపరస్మాకర స్థితిలో ఉన్న శ్రీనివాసరావును 108 అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంబంధిత వార్తలు