'రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు?'

'రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు?' - Sakshi


కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ అడ్డుకున్నా దీక్ష కొనసాగిస్తామని, రిజర్వేషన్ ఫలాలు తమ జాతికి అందాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది.



ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విషయం చెబితే తమ జాతి కూడా అలాగే ఎదుగుతుందని అన్నారు. తాను, తన భార్య ఆరోగ్యంగా ఉన్నామని, అయితే తాము అనారోగ్యంగా ఉన్నట్టు చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ మనిషి తిండిలేకుండా ఎన్ని రోజులు బతకగలడో తమను చూసి చంద్రబాబు మెడికల్ హిస్టరీలో రాసుకోవాలని ముద్రగడ పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top