చంద్రబాబుకు మరోసారి ముద్రగడ లేఖ
కాకినాడ: కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లేఖ రాశారు. గతంలో కాపు రిజర్వేషన్లపై తాను పోరాటం చేయలేదంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. 'గతంలో రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని మీరంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన జీవో నెంబర్.30 సాధించిన విషయం మీకు తెలియదా? ఆ జీవో చెత్త జీవో అన్నది మీరు కాదా?
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఓ పెద్దాయనతో రిట్ వేయించి ఆ జీవోపై స్టే తెప్పించింది వాస్తవం కాదా? ఆ తర్వాత 1995లో హైకోర్టు ఫుల్ బెంచ్ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి వెన్నుపోటుతో కలిపి పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు. మీ ఏలుబడిలో ఆ తీర్పును ఎందుకు అమలు చేయలేదు. కాపులకు ఎన్నో చేశానంటున్న మీరు జీవో 30కి వ్యతిరేకంగా కోర్టుకు ఎందుకు వెళ్లారు?.' అని ముద్రగడ తన లేఖలో ప్రశ్నలు సంధించారు.