'టీడీపీని భూస్థాపితం చేస్తాం'
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగలకు చేస్తున్న అన్యాయానికి బదులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్ని రమణయ్య హెచ్చరించారు. అనంతపురంలో ఏప్రిల్ 30న నిర్వహించ తలపెట్టిన మాదిగల దండోరా దండయాత్ర సభకు టీడీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరణకు నిరసనగా శనివారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలను మోసం చేసిన చంద్రబాబుకు, ఆయన పార్టీకి జీవితంలో పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాదిగలను అన్ని విధాలా వాడుకుని ఇప్పుడు అంటరానివారి మాదిరిగా మాపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం దారుణమన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకులకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పదవులు కట్టబెట్టిన చంద్రబాబుకు రానున్న రోజుల్లో మాదిగలు సరైన బుద్ధి చెపుతారన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని ప్రతి మాదిగ ఇళ్లకు తిరగి ప్రచారం చేస్తామన్నారు. తొలుత వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కో-కన్వీనర్ ఎలీషాకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దెపూడి గిరి, జిల్లా అధ్యక్షుడు మందా రవికుమార్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు