బిడ్డలతో సహా తల్లి అదృశ్యం
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన బోయ లక్ష్మి తన ముగ్గురు పిల్లలతో కలసి కర్నూలులో అదృశ్యమయ్యింది. కల్లూరు మండలం శరీన్నగర్కు చెందిన బోయ వెంకటేశ్వర్లు కూతురైన లక్ష్మికి కల్లుకుంట గ్రామానికి చెందిన నరసింహులుతో ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. అప్పటినుంచి భార్యాభర్తలు హైదరబాదులో స్థిరపడి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. దసరా పండుగకని పుట్టినింటికి శరీన్నగర్కు వచ్చింది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ ఆరోగ్యంగా లేరు, పండుగ చేయడం లేదని తల్లిదండ్రులు చెప్పడంతో మెట్టినిల్లు కల్లుకుంటలో అత్త, మామలతో కలసి దసరా పండుగ చేసుకుంటానని ఈనెల 10వ తేదీన తన పిల్లలతో కలసి శరీన్నగర్ నుంచి వెళ్లిపోయింది. అయితే భర్త ఉన్న హైదరబాదుకు గాని, అత్తమామలు ఉన్న కల్లుకుంటకు గాని ఆమె చేరుకోలేదు. ఆమె ఆచూకీ కోసం బంధువులు, తెలిసినవారి వద్ద ఆరా తీసినా కనిపించలేదు. దీంతో తమ్ముడు రామచంద్రుడు పోలీసులను ఆశ్రయించాడు. మహిళా అదృశ్యం కేసు కింద నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 32 సంవత్సరాల వయస్సు, 4.9 అడుగుల ఎత్తు, తెలుపు వర్ణం ఉంది. పిల్లలు బోయ లోకేష్ నాయుడు(10) నాలుగు అడుగుల ఎత్తు ఉంటాడు. అశోక్ నాయుడు(8) మూడు అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉంటాడు. కూతురు శ్రావణి(6) 2.5 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ రంగు ఉంటుంది. తప్పిపోయిన లక్ష్మీ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసినవారు 94406 27736 , 08518–259462కు ఫోన్ చేసి సమాచారం అందించాలని నాల్గవ పట్టణ సీఐ నాగరాజరావు కోరారు.