విశాఖ - కౌలాలంపూర్‌కు మరిన్ని సర్వీసులు


విశాఖపట్నం : మేలో ప్రారంభించిన విశాఖ- కౌలాలంపూర్ విమాన సర్వీసులకు కొద్ది కాలంలోనే భారీ స్పందన రావడం ఆనందంగా ఉందని ఎయిర్ ఏషియా సీఈఓ ఎయిరీన్ ఒమర్ అన్నారు. ప్రస్తుతం వారానికి రెండు సర్వీసులు నడుపుతున్న ఎయిర్ ఏషియా.. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు పెంచుతామని ప్రకటించారు. విశాఖ వచ్చిన ఆమె.. స్థానిక ఓ హోటల్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు.  రెండు నగరాల మధ్య విమాన ప్రయాణికులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారని, 78 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో నిలకడగా ఉందన్నారు.

 

 విశాఖపట్నం నుంచి వచ్చే అతిథులకు ఫ్లై త్రూ అడ్డంకులు లేని ప్రయాణ అనుభవాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఫ్లై త్రూ టికెట్లు భారీగా అమ్ముడవడానికి ట్రాన్సిట్ వీసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి లేకపోవడమేనని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. గోవా- కౌలాలంపర్‌కు ఎయిర్ ఏషియా మాత్రమే విమానాన్ని నడుపుతోందని స్పష్టం చేశారు. అలాగే తిరుచిరాపల్లి, కొచ్చి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి నేరుగా కౌలాలంపూర్‌కు విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎయిర్ ఏషియా ప్రతినిధులు అజిజ్ లైకర్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top