ఎమ్మెల్యేగారికి కోపం వచ్చింది
యలమంచిలి(పశ్చిమగోదావరి): ఏనుగువానిలంక గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డును పూర్తి చేయాలని కోరిన మహిళపై ఎమ్మెల్యే కోపంతో చిందులు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఇప్పటికే సిమెంటు ఉన్న రోడ్డు వినుకొండ సూర్యకుమారి ఇంటి వద్ద అసంపూర్తిగా మిగిలింది. వీధి చివరి వరకూ దానిని పూర్తి చేయాలని ఆ గృహిణి కొన్ని రోజులుగా కోరుతోంది.
బుధవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రామానాయుడును ఆమె ఇదే విషయమై గట్టిగా నిలదీసింది. దీంతో ఆయనకు విపరీతంగా కోపం వచ్చింది. సూర్యకుమారిపై గట్టిగా కేకలు వేశారు. తమ వద్ద డబ్బులు తీసుకుని, ఓట్లేశారంటూ మాట్లాడారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఎమ్మెల్యే తీరు చూసి ముక్కున వేలేసుకున్నారు.