ఏం చెప్పాలిరా దేవుడా..!
ఎల్.ఎన్.పేట: బాబు బాకా ఊదేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అరకొరగా చేసిన రుణమాఫీపై శుక్రవారం నుంచి అధికారులు గ్రామగ్రామాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అసలే విడతలు విడతలుగా మాఫీ జరుగుతోంది. అందులోనూ ఎవరికి ఎంత మాఫీ అయ్యిందో స్పష్టత లేదు. ఇన్ని అవరోధాల మధ్య రైతుల మధ్యకు వెళ్లి అవగాహన కల్పించడానికి అధికారులకు ధైర్యం చాలడం లేదు. రెండో విడతలో వచ్చిన జాబితాలో రెవెన్యూ గ్రామాల వారీగా పరిశీలిస్తే ఆయా గ్రామాలకు చెందిన అందరి రైతులు పేర్లు లేవని, కొందరివి మాత్రమే వచ్చాయని అంటున్నారు.
కొందరి పేర్లతో వచ్చిన రుణ ఉపశమన పత్రాలు తీసుకుని గ్రామాలకు వెళితే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. తక్కువ మంది రైతులకు మాత్రమే ఉపశమన పత్రాలు వచ్చాయని, మెజార్టీ రైతులవి రాలేదని అంటున్నారు. ఎక్కువ మంది రైతులు తమని నిలదీస్తారని, రుణ ఉపశమన పత్రాలు రాని రైతులకు ఏం సమాధానం చెప్పాలని ఆందోళన చెందుతున్నారు. ఇదెక్కడి ఉద్యోగంరా ‘బాబూ’ అంటూ తలలు పట్టుకుంటున్నారు.