మహిళా క్రికెట్కు ఉజ్వల భవిష్యత్తు
♦ మిథాలీరాజ్ను ఆదర్శంగా తీసుకోవాలి
♦ జిల్లా ఒలింపిక్ సంఘం కన్వీనర్ ఒంటేరు
కడప స్పోర్ట్స్ : రానున్న కాలంలో మహిళా క్రికెట్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్హక్ కమిటీ కన్వీనర్ ఒంటేరు శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీఎస్ఏ వైఎస్ఆర్ కేడీసీఏ నెట్స్ కేంద్రంలో జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలికల క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచ మహిళల క్రికెట్లో మనదేశ క్రీడాకారిణులు చక్కగా రాణించి అందరి మనసులను గెలుచుకున్నారన్నారు. భారత మహిళా క్రికెట్లో రాణిస్తున్న మిథాలీరాజ్, కౌర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు.
ఆర్ఐపీఈ రామకృష్ణ మాట్లాడుతూ పురుషుల క్రికెట్తో పోల్చితే మహిళల క్రికెట్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.వి.వి. ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కొందరు క్రీడాకారిణులు ఏసీఏ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఆడుతున్న నేపథ్యంలో అందులో రాణించే వారిని సైతం పరిగణిలోకి తీసుకుని తుది జట్టును ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎ. మురళీకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు దిలీప్కుమార్, జిలానీబాషా, ఎజాజ్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు