'టీటీడీపీ నాయకులకు సోయ లేదా?'

'టీటీడీపీ నాయకులకు సోయ లేదా?' - Sakshi


బిర్కూర్: తెలంగాణ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నఆంధ్రా బాబును ఇక్కడి టీడీపీ నాయకులు సమర్థిస్తారా? అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం నాచుపల్లి పెద్ద చెరువులో మిషన్‌కాకతీయ పథకం కింద పూడికతీత పనులను హరీష్‌రావు మరో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఎన్నో విధాలుగా అడ్డుకున్నారని.. అయినా సాధించుకున్నామని, అలాగే తెలంగాణ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ మహా మొండి ఘటమని, అదిరేది లేదు బెదిరేది లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ సీపీఎం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశాడని, సుప్రీంకోర్టులో కేసులు కూడా వేస్తానంటున్నాడని, ఆంధ్రా బాబును తెలంగాణ టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారా స్పష్టం చేయాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ పార్టీ తెలంగాణ నాయకులు అందరూ టీఆర్‌ఎస్‌లో చేరారని... టీడీపీ నాయకులకు ఆ మాత్రం సోయ లేదా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వారు మేల్కోకుంటే విజయవాడ వరకు ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.



Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top