గెలుపు మాదే!

గెలుపు మాదే! - Sakshi


సవాల్‌కు మంత్రి అఖిల కట్టుబడి ఉండాలి

చైర్‌పర్సన్‌ను దించడం సాధ్యం కాదు

వైఎస్‌ఆర్‌సీపీ బలం రోజురోజుకూ పెరుగుతోంది

బ్రహ్మానందరెడ్డి భూమా వారసుడు కాదు

మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి

పార్టీలో గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్య చేరిక




నంద్యాల/నంద్యాల వ్యవసాయం: ఉపఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయమని, సవాల్‌కు కట్టుబడి మంత్రి, ఎమ్మెల్యే పదవులకు అఖిలప్రియ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి అన్నారు. తాను ఓడితే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ బాలపక్కీరయ్య, మాజీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు గోపవరం గోపీనాథరెడ్డి బుధవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. ఏడుగురు కౌన్సిలర్లు తమ వర్గంలోకి  వచ్చారని.. మొత్తం 42మందిలో 26మంది తమ వైపు ఉన్నారన్నారు. చైర్‌ పర్సన్‌ దేశం సులోచనను పదవి నుంచి దించుతామని ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను సవాల్‌గా స్వీకరించానని చెప్పారు. తన వర్గానికి చెందిన వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, కాని వారంతా తనకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ నేతలు తేదీ ఎప్పుడు చెప్పినా బల ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు.



బ్రహ్మానందరెడ్డి భూమా వారసుడు కాదు...

టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి..దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వారసుడు కాదని శిల్పా అన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు మాత్రమే వారసులన్నారు. నంద్యాలలో జరిగిన ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించారన్నారు. అయితే అతను భూమా వారసుడు కాకపోవడంతో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని  ప్రకటించారన్నారు. తాను వైఎస్సార్సీపీలో చేరడానికి గంట ముందు కూడా పలువురు మంత్రులు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. కాని తాను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పారు. టీడీపీ నాన్పుడు ధోరణి, మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి వల్లనే తాను టీడీపీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీలో కార్యకర్తలు, నేతలు చేరడం సహజమేనని, కాని ప్రతిపక్ష పార్టీలో చేరడం సాహసోపేతమన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా ఎదురీదాల్సి వస్తుందని, కార్యకర్తలు తాను అండగా ఉంటానని చెప్పారు.



వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్య...

దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు గోపీనాథరెడ్డి స్థానిక బ్రహ్మాటవర్స్‌లో జరిగిన కార్యక్రమంలో శిల్పా సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా  గోనీనాథరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పతనం నంద్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. నంద్యాలలో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తామని, శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపిస్తామన్నారు. గోపీనాథరెడ్డి సేవలను వినియోగించుకుంటామని శిల్పామోహన్‌రెడ్డి తెలిపారు.

 

అరాచకాలను అడ్డుకట్ట వేద్దాం..

శిల్పా స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ బాలపక్కీరయ్య ఆయన వర్గానికి చెందిన గఫూర్, రాజశేఖర్‌గౌడ్, శ్రీనివాసులుగౌడ్, 150మంది కార్యకర్తలు శిల్పా సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ దేశం సులోచన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్ట వేసి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలంటే శిల్పాను గెలిపించాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ.. గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్యల చేరికతో పార్టీ బలోపేతమైందన్నారు.  కార్యక్రమంలో నాయకులు విజయశేఖర్‌రెడ్డి, రామసుబ్బయ్య, సాయినాథరెడ్డి, కౌన్సిలర్లు అనిల్‌ అమృతరాజ్, వెంకటసుబ్బయ్య, పున్నా రాజేశ్వరి, జాకీర్, కో ఆప్షన్‌ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి,  కృష్ణమోహన్, చంద్రమోహన్, మధు పాల్గొన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top