ముక్తియార్‌తో ఆది చర్చలు


ప్రొద్దుటూరు టౌన్‌: మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ రమేష్‌నాయుడు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వీఎస్‌ ముక్తియార్‌తో చర్చించేందుకు శనివారం రాత్రి ఆయన స్వగృహానికి వెళ్లారు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. సీఎం వద్దకు రావాలని, విషయం అక్కడ తేలుస్తామని ముక్తియార్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ముక్తియార్‌ వద్ద ఉన్న 14 మంది కౌన్సిలర్లు ఆదివారం చైర్మన్‌ ఎన్నిక జరిగిన వెంటనే నేరుగా సీఎం వద్దకు వెళ్లవచ్చని చెప్పారు. ఇందుకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.



ముక్తియార్‌ గంటల కొద్దీ వారితో చర్చలు జరుపుతుంటే తట్టుకోలేకపోయిన కౌన్సిలర్లు ఒక్క సారిగా తామంతా ఎమ్మెల్యే వద్దకు వెళుతున్నామని కారు ఎక్కారు.  వెళ్లాలనుకుంటే మీరు ఒక్కరే వెళ్లొచ్చని, తమదారి తాము చూసుకుంటామన్నారు. కాగా, ముక్తియార్‌కు టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో చర్చలను ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం ఉదయం జరిగే చర్చలను బట్టి ముక్తియార్‌ వైఖరి స్పష్టం కానుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top