మాతల ఇసుక ర్యాంపుపై మైన్స్ అధికారుల దాడి
కొత్తూరు: మండలంలోని మాతల గ్రామం వద్ద వంశధార నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుపై మైన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు హనుమంతు రావు దాడి చేశారు.ఆరు ఇసుక లారీలను నివగాం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నారు. అయితే వాటిపై ఎలాంటి కేసులు రాయకుండా అన్లోడ్ చేయించి విడిచిపెట్టడం గమనార్హం. తవ్వకాలు చేస్తున్న ప్రాంతంను తహసీల్దార్ రామకృష్ణ పరిశీలించారు. అనుమతులు ఇచ్చిన చోట తవ్వకాలు చేయకుండా నదిలో ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించామన్నారు. మైన్స్ ఏడీ ఆదేశాల మేరకు అన్లోడ్ చేసి లారీలను పంపించినట్లు ఏజీ తెలిపారు. దాడిలో తహశీల్దార్తో పాటు ఆర్ఐలు భీమారావు, వీఆర్వో సంగమేశ్వరరావు, సర్వేయర్ శ్రీరాములు పాల్గొన్నారు.
స్వామి భక్తి చూపించిన అధికారులు...
వంశధార నది నుంచి అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని కేసులు నమోదుచేయక పోవడం విచారకరమని, టీడీపీ నేతలకు అధికారులకు స్వామి భక్తి చూపించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. పట్టుకున్న లారీలపై అధికారులు ఎందుకు కేసులు నమోదు చేయాలేదన్నారు. టీడీపీ నేతలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.