మిడ్ మానేరు నిర్వాసితుల దీక్ష భగ్నం..నిరసన
వేములవాడ: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ మిడ్ మానేరు నిర్వాసితులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం రుద్రవరం సమీపంలో మిడ్ మానేరు నిర్వాసితులు తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలంటూ దీక్ష చేస్తున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల ప్రాంతంలో దీక్ష స్థలికి చేరుకున్న పోలీసులు దీక్ష చేస్తున్న 22 మందిని బలవంతంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, తమకు న్యాయం జరగాలంటూ నిర్వాసితులు నినాదాలు చేస్తూ.. వైద్యం చేయించుకోవడానికి సహకరించకుండా సత్యాగ్రహం చేస్తున్నారు. నిరాహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా కుదురుపాకలో శనివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.