4న వ్యవసాయ మంత్రితో కౌలు రైతుల భేటీ
ఒంగోలు టౌన్: జిల్లాలోని కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటలోని వ్యవసాయశాఖామంత్రిని కలవనున్నట్లు కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 60 శాతం పైగా భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించిందని, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందన్నారు. కౌలుదారుల రక్షణకు 2011లో భూ అధీకృత చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని, ఈ చట్ట ప్రకారం రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి కౌలుదారులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందించి రుణాలతోపాటు ఇతర సబ్సిడీలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులిచ్చేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రుణ అర్హత కార్డు లేకపోవడంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తించకుండా పోతుందన్నారు. వ్యవసాయ శాఖామంత్రితో భేటీ కానున్నందున జిల్లాలోని కౌలు రైతులంతా హాజరుకావాలని ఆయన కోరారు.