హత్యా..ఆత్మహత్యా?

హత్యా..ఆత్మహత్యా? - Sakshi


మహిళ అనుమానాస్పద మృతి

బాధిత కుటుంబసభ్యుల ఆందోళన




హన్వాడ /గండేడ్‌ : ఓ వివాహిత మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యా.. లేక ఆత్మహత్యనా అనేది మిస్టరీగా మారింది. ఈ సంఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలిలా.. హన్వాడ మండలం తిర్మలగిరికి చెందిన లక్ష్మీ (22)ని గండేడ్‌కు చెందిన కేశవులుకు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.2లక్షల నగదు, 8తులాల బంగారాన్ని ముట్టజెప్పారు. వారికి రెండు నెలలు బాబు కూడా ఉన్నాడు. కొన్ని నెలలుగా అదనపు కట్నం కావాలని లక్ష్మీని భర్తతోపాటు అత్తామామలు గాజుల చెన్నమ్మ, వెంకటయ్యలు వేధింపులకు పాల్పడేవారు. ఆదివారంరాత్రి కూడా ఇదే విషయమై గొడవ జరిగింది.


అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు. సోమవారం ఉదయానికల్లా లక్ష్మీ ఇంట్లో పూర్తిగా కాలిపోయి శవమై కనిపించింది. ఇరుగుపొరుగు వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భర్త, అత్తామామలు, బావ గిరమోని ఆంజనేయులు పరారవ్వడంతో అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న మహ్మదాబాద్‌ పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి చెన్నయ్య ఇది ముమ్మాటికీ హత్యేనని, తన కూతురిని చంపేసి పారిపోయారని ఫిర్యాదు చేశారు.

కుటుంబసభ్యుల ఆందోళన

ఈ సంఘటనపై తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కూతురిని హత్యచేసిన వారిపై చర్యలు తీసుకొని పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనతో తిరుమలగిరిలో విషాదం అలుముకుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top