కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలి

కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలి

రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ    ∙

పలు గ్రామాల్లో పర్యటన

రంగంపేట : స్థానిక సమస్యలు, కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ కోరారు. చైర్మన్‌ మంజునాథ, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణలు గురువారం జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించారు. స్థానిక సమస్యలు, భౌగోళిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంపేట మండలం పాత కోటపాడులో ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించారు. అన్ని తరగతులలోను ప్రథమ శ్రేణి మార్కులు వచ్చినా ఉద్యోగావకాశాలు లేవని ఎంబీఏ పట్టభద్రుడు గవరసాని వీరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసినా  ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెల్లమేకల దుర్గాప్రసాద్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ –1 రాధాకృష్ణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, సర్పంచ్‌ బత్తిన వీరయమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఐతి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసమే 

రావులపాలెం : మంజునాథ కమిషన్‌ కేవలం కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిషన్‌ కాదని రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన కులాల స్థితిగతులను అధ్యయం చేయడం కోసమేనని జస్టిస్‌ మంజునాథ స్పష్టం చేశారు. గురువా రం క్షేత్ర పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామా నికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన మంజునాథ బృందం ప్రజలతో ముఖాముఖి చర్చ నిర్వహించింది. కులాల మధ్య ఉన్న సఖ్యత, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన సరోజిని అనే కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ మాట్లాడుతూ తన తండ్రి మద్యానికి బానిస కావడంతో తమ కుటుంబ ఆర్థికంగా చితికిపోయిందని  తాను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మంజునాథ మాట్లాడుతూ తండ్రి ఎన్నో ఏళ్ళుగా మద్యానికి బానిసైతే ఎందుకు వ్యతిరేకించి మానిపించలేకపోయావని ప్రశ్నించారు. ప్రయత్నించి విఫలం అయ్యానని ఆమె చెప్పడంతో ఏ సమస్య అయినా వ్యక్తిగా పరిష్కరించుకోలేనప్పుడు సంఘటితంగా పోరాడాలని సూచించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ చినబాబు, సర్పంచ్‌ మాసాబత్తుల సుమతి, తహసీల్దార్‌ ఉదయభాస్కర్, సీఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 

గురజనాపల్లిలో  క్షేత్రస్థాయి పరిశీలన

కరప : గురజనాపల్లి గ్రామంలో జస్టిస్‌ మంజునాథ, సభ్యులు పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. మంజునాథ మాట్లాడుతూ గ్రామ జనాభా ఎంత, సాగు విస్తీర్ణం ఎంత, ఎన్నికులాలు ఉన్నాయి. కులాలవారీగా వారి సామాజిక స్థితిగతులు, అక్షరాస్యత, నిరక్షరాస్యత, చదుకున్నవారు ఏఏ డిగ్రీలు చదివారు, వారి పరిస్థితుల అంశాలను వివరించాలని కోరారు. కరప సర్పంచ్‌ పంపన కన్నారావు, కార్యదర్శి సీహెచ్‌ ఇందిరలు గ్రామం వివరాలు తెలిపారు. మాజీ సర్పంచ్‌ పెంటపాటి సత్తిబాబు, పబ్బినీడి కృష్ణలు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువగా ఉప్పు కార్మికులుంటారని, వీరికి ఆరు నెలలు పనులుంటే, ఆరు నెలలు ఖాళీగా ఉంటారన్నారని, వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఉపాధి పథకం ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. వివిధ కులాలవారు తమ సమస్యలను, బాధలను కమిషన్‌కు వివరించారు. ఉప్పు కార్మికులను దగ్గరకు పిలిపించి వారి ఆరోగ్య సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఆర్డీవో ఎల్‌.రఘుబాబు, తహసీల్దార్‌ బూసి శ్రీదేవి, ఇన్‌చార్జి ఎంపీడీవో, భీమశంకరరావు, 

కులాలవారీగా సమీక్ష

పెద్దాపురం : సామాజిక వెనుకబాటుపై స్పందించి అన్ని కులాలకు న్యాయం చేయాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథకు పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కట్టమూరులో కులాల వారీగా జస్టిస్‌ మంజునాథ సమీక్ష జరిపారు. గ్రామానికి చెందిన రంగనాథం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివనాగరాజు, మాదిరెడ్డి సత్తిబాబు, పెంటా విజయ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధరం, సర్పంచ్‌ దిమ్మల పుష్పరత్నంలు తమ తమ కులాలు వెనుకబడి ఉన్నాయని, అన్ని కులాల్లో కూడా సామాన్య  కుటుంబాలు ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సామాజిక వెనుకబాటును గుర్తుంచుకుని రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్‌ వరహాలయ్య, ఎంపీడీవో వసంతమాధవి, ఈవోపీఆర్డీ హిమమహేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ముద్రగడ దూత స్వామి వినతిపత్రం అందజేత

గ్రామానికి వచ్చిన బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథకు కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనుచరుడు, కాపు నాయకులు గౌతు స్వామి ఆధ్వర్యంలో జేఏసీ నియోజకవర్గ కన్వీనర్‌ మలకల చంటిబాబు, పట్టణ కన్వీనర్‌ జిగిని రాజుబాబుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని, కాపు కులస్తులు చాలా కుటుంబాలు ఇప్పటికీ వెనుకబాటుతనంలో ఉన్నాయన్నారు. కమిషన్‌ వాటిని గుర్తించాలని వారు కోరారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top