వ్యక్తి దారుణ హత్య
పులివెందుల : తన తల్లిని వేధిస్తున్నారని ఓ వ్యక్తిని ఒక యువకుడు దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన ఆనంద్(40) అనే వ్యక్తి ఆర్ఎంపీగా పని చేస్తూ జీవనం కొనసాగించే వాడు. అతను కదిరి మండలం తలుపుల గ్రామానికి చెందిన సలీంఖాన్(27) అనే వ్యక్తికి చెందిన తల్లికి నిత్యం ఫోన్లు చేస్తూ మానసికంగా వేధించే వాడు. విషయం తెలుసుకున్న సలీంఖాన్.. ఆనంద్పై కక్ష పెంచుకొని ఎలాగైనా అంతం చేయాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న ఆయన ఆనంద్కు ఫోన్ చేసి మాయమాటలు చెప్పి తలుపులకు రప్పించుకున్నాడు. ఆ రోజు రాత్రి వారిద్దరూ మద్యం సేవించారు. తర్వాత ఆనంద్ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఒక సంచిలో మూటకట్టి రాత్రికి రాత్రే పులివెందులకు వాహనంలో చేరుకొని రింగ్ రోడ్డులో బ్రిడ్జి కింద వేసి వెళ్లిపోయాడు. ఆనంద్ కుటుంబ సభ్యులు కదిరి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా సలీంఖాన్ను తమదైన శైలిలో విచారణ చేశారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకొన్నాడు. శుక్రవారం కదిరి పోలీసులు పులివెందులకు చేరుకొని మృతదేహం ఉన్న చోటనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.