రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


బొండపల్లి (గజపతినగరం): మండలంలోని బిల్లలవలస జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన వ్యక్తులు ఆటోలో కూరగాయలను విజయనగరం మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. సరిగ్గా బొండపల్లి మండలం బిళ్లలవలస జాతీయరహదారి వద్దకు చేరుకునే సరికి విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న బొలేరా వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పక్కనున్న తుప్పల్లోకి తుళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆవాల వంశీ (20) అక్కడికక్కడే మృతి చెందగా, మిత్తిరిబింగి రామారావు, గొలుసు భాస్కరరావు, సరగడ త్రినాథలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బొండపల్లి ఎస్సై సుదర్శన్, గజపతినగరం సీఐ లీలారావు సంఘటనా స్థలానికి చేరుకుని  క్షతగాత్రులను 108 వాహనం ద్వారా విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడు వంశీ హైదరాబాద్‌లో ప్రొక్లయినర్‌  డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్సై సుదర్శన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top