రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

 

కొనకనమిట్ల : పొట్టకూటి కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన ఒంగోలు – గిద్దలూరు రహదారిపై కొనకనమిట్ల మండలం గొట్లగట్టు సమీపంలో మంగళవారం జరిగింది. చీమకుర్తి మండలం ఇలపావులూరుకు చెందిన పులి శ్రీను (47) తాళ్లూరు ప్రాంతానికి చెందిన పొట్టేళ్ల వ్యాపారి వద్ద పనిచేస్తుంటాడు.

 

ఇటీవల అయ్యప్పమాల ధరించిన శ్రీను.. మంగళవారం పొట్టేళ్లు కొనుగోలు నిమిత్తం వ్యాపారి మస్తాన్‌తో కలిసి హనుమంతునిపాడు మండలం గుడిపాటిపల్లి వెళ్లాడు. పొట్టేళ్లు కొనుగోలు చేసి ఆటోలో ఎక్కించుకుని తిరిగి తాళ్లూరు వస్తున్నారు. శ్రీను ఆటో వెనుక నిలబడి ఉన్నాడు. ఆటో గొట్లగట్టు సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా తెనాలి ప్రాంతానికి చెందిన లారీ పందెపు ఎడ్లు తీసుకుని గిద్దలూరు వైపు వెళ్తూ ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఎడ్లకు సంబంధించిన కాడిమాను శ్రీను తల, మెుహానికి బలంగా తగలడంతో ఒక చెంప భాగం మొత్తం తెగిపోయింది. దీంతో శ్రీను కిందకు వేలాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు.

 

విషయం తెలుసుకున్న శ్రీను బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనుకు భార్య ఇందిర, కుమారుడు సీతారామయ్య ఉన్నారు. ఏఎస్‌ఐ సయ్యద్‌అల్లాభక్షు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీను మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top