యాసిడ్ తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవారం రాత్రి ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సిద్దిపేట ఇందూర్ కాలేజికి చెందిన వైష్ణవి(19), సాయికుమార్(20) యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన సాయికుమార్, సిద్దిపేటకు చెందిన వైష్ణవి ప్రేమించుకున్నట్లు సమాచారం. వీరిద్దరు స్కూటీపై సిరిసిల్లకు వచ్చారు. తామిద్దరం యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
యాసిడ్ తాగిన సాయికుమార్, వైష్ణవి సిరిసిల్ల మానేరు వంతెన ప్రాంతంలో అపస్మారకస్థితిలో ఉండగా స్థానికులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మాట్లాడే స్థితిలో లేని వారికి డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు ఆస్పత్రి వర్గాలు సమాచారాన్ని అందించారు. సిద్దిపేట ప్రేమజంట సిరిసిల్లలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.