ప్రియురాలిని చంపి ఇంట్లో పాతి పెట్టాడు..

ప్రియురాలిని చంపి ఇంట్లో పాతి పెట్టాడు.. - Sakshi


చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..

నేడు మృతదేహం వెలికితీత


 

 గుర్రంకొండ/తిరుపతిక్రైం: మూడేళ్లు ప్రేమాయణం సాగించి చివరకు ప్రియురాలి ప్రాణాలు తీసి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ వ్యక్తి. చిత్తూరు జిల్లా గుర్రంకొండ వుండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజునే ఆమె మృతదేహాన్ని వెలికితీయునున్నారు. వాల్మీకిపురం మండలం పునుగుపల్లికి చెందిన జిలానీ కుమార్తె షేక్ సబీహా అలియాస్ సంధ్య(23) గుర్రంకొండ మండలం నక్కలవాళ్లపల్లెకు చెందిన వేమనారాయణరెడ్డి(28) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వేమనారాయణరెడ్డి వాల్మీకిపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్.



షేక్ సబీహా బెంగళూరులో పనిచేసేందుకు వెళుతున్నానని తల్లికి చెప్పి రెండేళ్ల కిందట తిరుపతికి చేరుకుంది. నగరంలోని ఓ ఇంటిని వీరిద్దరూ అద్దెకు తీసుకున్నారు. ఇటీవల ఆమె పేరును సంధ్యగా మార్చి ఓ మోటార్ వాహనాల షోరూంలో అకౌం టెంట్‌గా చేర్పించాడు. ఆధార్, ఓటర్ కార్డుల్లో కూడా సబీహా పేరును సంధ్యగా మార్చి వారికి ఆ ప్రూఫ్‌లు ఇచ్చాడు. కాగా, అదే షోరూంలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతను ఆమెకు ఓ స్కూటర్ కూడా కొనిచ్చాడు. ఇద్దరూ కలసి వివిధ ప్రాంతాలు తిరిగి వచ్చారు. ఈ విష యం తెలుసుకున్న వేమనారాయణరెడ్డి  తనను పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది.



ఈ క్రమంలో ఇద్దరూ గొడవపడ్డారు. జనవరి 29న వేమనారాయణరెడ్డి తిరుపతిలోని ఇంటిని ఖాళీ చేసి సొంత గ్రామానికి చేరుకున్నాడు. సంధ్య విధులకు హాజరుకాకపోవడంతో షోరూం సిబ్బంది ఈ నెల 2న ఆమె తల్లికి ఫోన్ చేశారు. తన కూతురు పేరు సంధ్య కాదని షేక్ సబీహా అని తెలిపింది. తమ కిచ్చిన అడ్రస్‌లో సంధ్యగా ఉందని పేర్కొనడంతో తల్లికి అనుమానం వచ్చి వెంటనే తిరుపతి వెస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వేమనారాయణరెడ్డి కూడా కన్పించకపోవడంతో అతన్ని వెతికి పట్టుకొని విచారించారు. పెళ్లికి నిరాకరించడంతో ఆమెను హతమార్చి నక్కలవాళ్లపల్లిలోని తన ఇంట్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెలిపాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top