వెంకన్న సన్నిధిని వదలని చిరుతలు


- వేకువజాము 4.30 గంటలకు చొరబడిన చిరుత

- అదే సమయంలోనూ కాలిబాటలో మరో చిరుత



సాక్షి,తిరుమల


చిరుతలు తిరుమల శివారు ప్రాంతాలను వదలటం లేదు. గురువారం వేకువజాము రెండు చిరుతలు కనిపించాయి. 4.30 గంటల ప్రాంతంలో బాలాజీనగర్ 8వ లైనులోని 755 ఇంటి ఎదురుగా వచ్చింది. జనావాసాల్లో చిరుత సంచార తీవ్రతను ఎత్తిచూపేందుకు సాక్షి బృందం అక్కడే వాహనంలో బుధవారం రాత్రంతా కాపుకాసింది. వేకువజాము సరిగ్గా 4.30 గంటల సమయంలో చిరుత అటవీమార్గం నుండి చిరుత రావటాన్ని సాక్షి బృందం గుర్తించింది. అది ఓ కుప్పతొట్టి వెనుకవైపు నక్కింది. తలను పెకైత్తి చూసింది. ఆ దృశ్యాలను సాక్షి బృందం క్షణాల్లో కెమెరాతో చిరుత ఫొటోలు చిత్రీకరించింది. అయినా ఆ చిరుత బెదరకుండా కుప్పతొట్టిపైకి ఎక్కింది. వాహనం తన సమీపానికి రావటాన్ని గుర్తించిన ఆ చిరుత దాడి చేసేందుకు సన్నద్ధమైంది. ఒకేసారి నాలుగు పాదాలను కుప్పతొట్టిపై బిగుంచుకుని తన శరీరాన్నంతా కూడగట్టుకుంది. ఇంతలో కెమెరా ఫ్లాష్‌తోపాటు ఫోకస్‌లైట్ల వెలుతురు పడటంతో అది క్షణాల్లో చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఇక తిరుపతికి వెళ్లే మొదటి రోడ్డుమార్గంలోని జీఎన్‌సీకి సమీపంలో తొలి మలుపు వద్ద చిరుత కాలిబాట నుండి రోడ్డు మార్గాన్ని దాటింది. ఆ సమయంలో కాలిబాటలో భక్తులు లేకపోడంతో ప్రమాదం తప్పింది. అదే చిరుత రోడ్డుపైకి రావటంతో తిరుపతికి వెళ్లే ప్రైవేట్ వాహనదారులు గుర్తించారు. తిరుమల శివారు ప్రాంతాల్లో నాలుగు, కాలిబాటల్లో రెండు చిరుతల సంచరిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న ఓ చిరుత లైవ్ ఫొటోలు ఇవ్వగా, గురువారం మరోసారి సాక్షి బృందం సాహసోపేతంగా మరో చిరుత చిత్రాలు అందించి సమస్యను పరిష్కరించాలని జనం పక్షాన సంబంధిత విభాగాలకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం చిరుతల బంధీ కోసం రెండు బోన్లు నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. వాటిలో ఎలాంటి ఎర వేయకుండానే మూసిఉంచటం వల్ల ఉండటం వల్ల చిరుతలు బోన్లు వద్దకు వెల్లటం లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండా బోన్లు నిర్వహించలేమని సంబంధిత ఫారెస్ట్ అధికారులు చెబుతుండటంతో చూస్తే.. ఆ విభాగాలకు చిరుతల బంధీ చేయాల్సిన ఆలోచనే లేదని తెలుస్తోంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top