బాబు కంటే కేసీఆర్ది దరిద్రమైన పాలన: కోమటిరెడ్డి
కట్టంగూర్(నల్లగొండ): టీఆర్ఎస్ సర్కార్పై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోమారు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ పాలన దరిద్రంగా ఉందని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల పరిధిలో ఆదివారం ఓ శుభకార్యానికి హాజరైన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు ఎన్. భాస్కర్రావు, రవీంద్రనాయక్లకు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. అప్పుడు వారు విజయం సాధిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి తన విలాసాలు, అట్టహాసాలు, వాస్తుల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.760 కోట్లను దుబారా చేశారని దుయ్యబట్టారు. గ్రామజ్యోతి పథకం ద్వారా ప్రతి గ్రామానికి రూ.5 కోట్లు ఇస్తామని చెప్పి రూ. 5 కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదే విధంగా సర్పంచ్ల 13వ ఫైనాన్స్ నిధులు 40 శాతం తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. మరోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు సర్వేలతో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.