కిడ్నాప్ చేస్తానని బెదిరించిన యువకుడి అరెస్టు
గిద్దలూరు : కిడ్నాప్ పేరుతో బెదిరింపులకు పాల్పడిన యువకుడిని గిద్దలూరు పోలీసులు మంగళవారం చాకచక్యంగా అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీహరిబాబు ఆ కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన దూదేకుల మస్తాన్ స్థానిక కాశినాయననగర్లో మార్బుల్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు నలుగురు పిల్లలు కాగా, నంద్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్లో తల్లి వద్దే ఉంచి చదివిస్తున్నాడు.
మస్తాన్ పిన్నమ్మ కుమారుడు దూదేకుల నాగేంద్రబాబు ఇతరుల సిమ్కార్డులు, సెల్ఫోన్లను వినియోగించి ఁనీ పిల్లలను కిడ్నాప్ చేస్తున్నా* అంటూ మస్తాన్కు వాట్సాప్ మెస్సేజ్లు పెట్టి భయపెట్టాడు. రెండు రోజులకోసారి కొత్త కొత్త నంబర్లతో వాట్సాప్ ద్వారా టెస్ట్, వారుుస్ మెస్సేజ్లు చేస్తూ రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన మస్తాన్.. ఈ నెల 13వ తేదీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు వారాలుగా దర్యాప్తు చేసి నిందితుడు వాడిన సెల్ఫోన్లు, సిమ్ల ఆధారంగా వలపన్ని పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడిని పట్టుకున్న గిద్దలూరు, కొమరోలు ఎస్సైలు ఆర్.రాంబాబు, ప్రభాకర్రెడ్డి, కానిస్టేబుల్లను ఎస్పీ త్రివిక్రమవర్మ ఫోన్లో అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వి.శ్రీరాం, ఎస్సై మల్లికార్జున, సిబ్బంది పాల్గొన్నారు.