కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్కు జైలు శిక్ష
విశాఖ: గత మూడు సంవత్సరాల క్రితం ఓ ఉద్యోగికి జీతం చెల్లించే క్రమంలో లంచం తీసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ దందమూరి కళ్యాణి సుందర్ (55) కి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.సునీత తీర్పుచెప్పారు. దీంతో పాటు పది వేల జరిమానాను కూడా విధించారు.
పోలీస్ సూపరింటెండెంట్ కె.గోపాలకృష్ణ శుక్రవారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలు కళ్యాణి సుందర్ 2012 ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్గా పనిచేసేవారు. ఫిర్యాది టి.సంతోష్కుమార్ అదే పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆ సమయంలో అతనికి 2012 ఆగస్టు నెల జీతం చెల్లించడానికి రూ.5వేల డిమాండ్ చేసి లంచంగా తీసుకున్నారు. నేరం రుజువు కావడంతో లంచం తీసుకున్నందుకు రెండేళ్ల జైలు, రూ.5వేల జరిమానా, అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఏడాది జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అధికారులు, సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే తక్షణమే సీబీఐని సంప్రదించాలని ఆయన కోరారు.