కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం..
కడప: వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్లో జరిగిన విజిలెన్స్ శాఖ కార్యక్రమానికి వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా, జెడ్పీ చైర్మన్ రవి హాజరయ్యారు. గ్రామ సర్పంచులు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడమేంటని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు, వైఎస్ఆర్సీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జన్మభూమి కమిటీలు సుప్రీం కాదని పేర్కొన్నారు. ఓడిపోయిన వాళ్లు సమీక్షలు చేస్తుంటే ప్రజాస్వామ్యానికి విలువ ఏముందని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేత వరదరాజులు, అధికారులు సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే రాచమల్లు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఓటమి పాలైన నేతలు సమీక్షలకు వెళ్లవద్దని అధికారులకు కలెక్టర్ సూచించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.