'ప్రత్యేక హోదా సాధించి తీరుతాం'

'ప్రత్యేక హోదా సాధించి తీరుతాం' - Sakshi


కిర్లంపూడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



రాష్ట్ర విభజన బిల్లుపై నాడు చర్చలో పాల్గొన్న ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదని, పదేళ్లు ఉండాలని వాదించారని, ఆ మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు రాజకీయ స్వలాభం కోసం ఎన్డీయే ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతూ ప్రజలను మోసం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారని విమర్శించారు.  సమస్యలను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీ సమావేశాలు కేవలం ఐదు రోజులే నిర్వహిస్తున్నారన్నారు.



ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజులకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  హోదా సాధన కోసం తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయనున్నామని తెలిపారు. దీంతోపాటు ‘మార్చ్ టు పార్లమెంట్ భవన్’ నిర్వహిస్తున్నామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top