ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై ఆరా
జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీవాగు పరివాహక ప్రాంతాన్ని అనుసరించి ఉన్న ప్రభుత్వ భూములలో ఇసుక నిల్వలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలిస్తున్నట్లు జేసీ శివకుమార్నాయుడు తెలిపారు. గురువారం ఆయన ఆకస్మికంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పలు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకుఆయా ఇసుకను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే మిడ్జిల్ మండలంలో వాడ్యాల, మున్ననూర్, మిడ్జిల్, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయన పోలేపల్లి గ్రామ పరిధిలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ,ప్రైవేట్ భూములకు సంబంధించి తప్పుగా ఉన్న పలు సర్వే నంబర్ల రికార్డులను తనిఖీ చేశారు. సమగ్ర వివరాలు సేకరించి కలెక్టర్కు నివేదించనున్నట్లు తెలిపారు. జేసీ వెంట తహసీల్దార్ లక్ష్మినారాయణ,తదితరులు ఉన్నారు.