ఆరవై ఏళ్లుగా అలరిస్తున్న స్వరం

ఆరవై ఏళ్లుగా అలరిస్తున్న స్వరం

  • ‘జిత్‌’కు జీవిత సాఫల్య పురస్కారం

  • రాజమహేంద్రవరం కల్చరల్‌ :

    తన స్వరంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తున్న శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. గాయకుడిగానే కాక నటుడు, క్రీడాకారుడు, న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రొటేరియన్‌ పట్టపగలు వెంకటరావు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఇతర ప్రముఖులు పురస్కారాన్ని అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా తన పాటలతో కళాభిమానులను అలరిస్తున్న జిత్‌.. భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా జిత్‌ మోహన్‌మిత్రా ఆర్కెస్ట్రా తరఫున గాయకులు సినీ గీతాలను ఆలపించారు. చిన్నారి షైలిక పాత్రో కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం, శ్రీపాద కుమారశర్మ, రుంకాని వెంకటేశ్వరరావు, మధు ఫామ్రా, అశోక్‌ కుమార్‌ జైన్, ఎస్‌బీ చౌదరి, మహ్మద్‌ఖాదర్‌ ఖాన్, గుమ్మడి సమర్పణరావు, బొడ్డు బుల్లెబ్బాయి పాల్గొన్నారు. జిత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని పట్టపగలు కోరారు. ఆనం కళాకేంద్రం అద్దెలు తగ్గించాలని పలువురు కోరగా ఈ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామని గోరంట్ల చెప్పారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top