'ఆమె తలుచుకుంటే కేసీఆర్ ఎంత?'

'సోనియా తలుచుకుంటే కేసీఆర్ ఎంత?' - Sakshi


ఆయన ఉద్యమం పాకిస్తాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువా?

ప్రజల ఆకాంక్షను గౌరవించే రాష్ట్ర విభజన

సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి




మిర్యాలగూడ : కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తొలిసారిగా టీఆర్‌ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తన మాటలకు పదునుపెట్టి సీఎం కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాడు యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే కేసీఆర్ ఎంతటి వాడని, ఆయన ఉద్యమం.. పాకిస్తాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువా అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. అభివృద్ధి కూడా రోజు రోజుకూ దిగజారుతోందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.



సర్వేలు బలంగా ఉంటే ఇతర పార్టీల వారెందుకు..

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని సర్వేల్లో వెల్లడైందని చెబుతున్న ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్లుగా చూపి ప్రజలను గోల్‌మాల్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వానికి విశ్వసనీయత లేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ పథకం వస్తుందని పేద ప్రజలను ఊరిస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ధరఖాస్తులు స్వీకరించి రాష్ట్రపతికి అందజేయనున్నట్లు జానారెడ్డి తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top