అక్రమార్జన కోసమే మంత్రి అడ్డదారులు
గంగరాం(కోటబొమ్మాళి): అక్రమార్జన కోసం మంత్రి అచ్చెన్నాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని, నట్టికుమార్ ఆరోపణలతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. ఆయన మంగళవారం గంగరాం గ్రామంలో సర్పంచ్ పేడాడ వెంకటరావు ఇంటిలో సాక్షితో మాట్లాడారు. 1995లో అచ్చెన్నాయుడు మొట్టమొదటిసారిగా శాసనసభ అభ్యర్థిగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ముందు ఎర్రన్నాయుడుకు ఆయనపై మంచి అభిప్రాయం ఉండేది కాదని, నేర చరిత్ర ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై మదన పడ్డారని, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఆయనను రాజకీయాల్లోకి తెచ్చారని చెప్పారు. మంత్రిగా అచ్చెన్నాయుడు మనస్తత్వం ఏటీఆర్ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేటతెల్లమైందని, ఈ సర్వేలో మహిళలను వేధిస్తున్న మంత్రిగా ఆయన నమోదయ్యారని తెలిపారు.
నయీమ్ వంటి అరాచక శక్తులను ప్రోత్సహించే మంత్రి ప్రశాంత వాతావరణంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేశారని తిలక్ ఆరోపించారు. సినీ నిర్మాత నట్టి కుమార్ మంత్రి అచ్చెన్నాయుడుపై చేస్తున్న బహిరంగ అరోపణలకు మంత్రి సమాధానం ఇవ్వాలన్నారు. చంద్రబాబుకు నైతిక విలువలు ఉంటే అచ్చెన్నను బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధికార ప్రతినిధి కాళ్ల సంజీవరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ దుబ్బ వెంకటరావు, నందిగాం ఎంపీపీ యర్ర చక్రవర్తి, సంపతిరావు హేమసుందరాజు, పార్టీ నాయకులు అన్నెపు రామారావు, నేతింటి నగేష్, దుబ్బ సింహాచలం, జి.సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.