ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదు

ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదు - Sakshi


♦ నేడు విజయవాడలో నిరసన మార్చ్: అంబటి

♦ వైఎస్ జగన్ దీక్ష భగ్నం అప్రజాస్వామికం

♦ 17 నుంచి 21 వరకూ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు

 

 సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నం చేయని ప్రభుత్వం, హోదా సాధించే బాధ్యతను భుజాన వేసుకున్న జగన్‌పై కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.



జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించినంత మాత్రాన ప్రత్యేక హోదా ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. జగన్ దీక్షపై అనుమానాలున్నాయని రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం తీసుకోకున్నా జగన్ ఎంతో ఉత్సాహంగా దీక్షలో కూర్చుంటున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు... జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో పోలీసులే బలవంతంగా జీజీహెచ్‌కు తరలించిన సంఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన సంఘటనపై పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు.



► దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకూ ‘నిరసన మార్చ్’ నిర్వహిస్తారు. నిరసన మార్చ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

►17వ తేదీ నుంచి 21వరకూ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. 18వ తేదీన రిలే నిరాహార దీక్షా శిబిరాలకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళతారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రసంగిస్తారు. 19న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, 20వ తేదీ సాయంత్రం నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, 21న ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా చేపడతారు. ఈ నెల 22న రాజధాని శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు.



 ప్రధానిని  కలిసేందుకు లేఖ రాస్తాం..

 ప్రత్యేక హోదా ఆవశ్యకత, నిరవధిక నిరాహార దీక్ష భగ్నం చేసిన సంఘటనలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారని అంబటి చెప్పారు. ఈనెల 22న రాజధాని శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ జగన్ లేఖ రాయనున్నారని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top