వేదసారాన్ని సామాన్యులకు తెలియజేయాలి
– వేదాల్లో సైన్స్ సదస్సులో టీటీడీ జేఈవో
తిరుపతి సిటీ: వేదాల్లో ఉన్న పరిశోధనాంశాలను వేద సైన్స్ ప్రాజెక్టు ద్వారా సామాన్యులకు చేరవేయాలని తిరుమల జేఈవో శ్రీనివాస రాజు అన్నారు. టీటీడీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో వీసీ దేవనాథన్ అధ్యక్షతన ‘వేదల్లో సైన్స్’ అనే అంశంపై ఒక్కరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. అంతకుముందు ఈ– క్లాస్ రూమ్ను జేఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైదిక్ యూనివర్సిటీని టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ విశ్వవిద్యాలయానికి తాను నాలుVó ళ్లపాటు పాలకమండలి సభ్యుడిగా పనిచేశానన్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజానికి తెలియని ఎన్నో అంశాలు వేదల్లో ఉన్నాయన్నారు. ఐన్స్టీన్ కూడా భారతీయ వేదాలు చాలా గొప్పవని చెప్పారని గుర్తు చేశారు. అనంతరం వీసీ దేవనాథన్ మాట్లాడుతూ 2014లో వేద సైన్స్ ప్రాజెక్టుగా రూపకల్పన జరిగిందన్నారు. 2015లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో 200 మందికి పైగా పరిశోధకులు పత్ర సమర్పణలు సమర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు నాలుగు వేదాల్లో ఉన్న కొన్ని అంశాలను తీసుకుని ఒక్కరోజు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20మంది పరిశోధకులు పత్ర సమర్పణ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. సదస్సులో రిటైర్డ్ ఉపకులపతి ఆచార్య కెవి. రామకృష్ణామాచార్యులు, డాక్టన్ ఎన్.మురళి, నందన్భట్, ఉమేశ్భట్, పీఆర్వో బ్రహ్మచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.