ఇంద్రకీలాద్రిపై రద్దీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
దుర్గగుడిపై భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో ఉదయం 7 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. రూ.100, వీఐపీ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు సైతం ముఖ మండప దర్శనాన్ని కల్పించారు. ఆదివారం కావడంతో ఘాట్ రోడ్డు మీదుగా భక్తులను కొండపైకి అనుమతించారు. వృద్ధులు, చిన్న పిల్లల తల్లులను లిఫ్ట్లోకి అనుమతించారు. అయితే కొంత మంది ఇతరులు కూడా లిఫ్ట్లో కొండపైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో లిఫ్ట్ వద్ద రద్దీ కనిపించింది. మహా మండపంలో విశ్రాంతి మందిరాలలో బస చేసిన భక్తులు తెల్లవారుజామున తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాలకు తరలివెళ్లారు. అయితే కనకదుర్గనగర్ నుంచి అరండల్ సత్రంలోకి కేశఖండన శాల తరలించడంపై సరైన ప్రచారం చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.