‘వలస కార్మికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం’
హైదరాబాద్: వలస కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమం కోసం 19 దేశాలతో మనదేశం ఒప్పందాలు కలిగి ఉందని..త్వరలో ‘బ్రిక్స్’ దేశాలతో సైతం ఈ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బ్రిక్స్ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూపు(బీఈడబ్ల్యూజీ) సమావేశాలు బుధ, గురువారాల్లో హైదరాబాద్లో జరిగాయి. ఈ సమావేశాల విశేషాలను కేంద్ర మంత్రి దత్తాత్రేయ విలేకరులకు తెలిపారు.
ఈ సమావేశాల్లో సమ్మిళిత అభివృద్ధి కోసం బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల్లో జరిపిన చర్చల ఆధారంగా వచ్చే సెప్టెంబర్లో జరగనున్న బ్రిక్స్ మంత్రుల సమావేశంలో ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, వేతన భద్రత, సామాజిక భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య కార్మికుల సులభ వలసలను ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో ఇది సాధ్యం కానుందన్నారు.