టె న్త్ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరా వైర్లు కట్
ఏలూరు సిటీ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల టె న్త్
పరీక్షా కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించి వైర్లను దుండగులు సోమవారం రాత్రి కట్ చేసినట్టు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా పది పరీక్షల్లో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన జిల్లా విద్యాశాఖ ఈ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలతో పాటు తొలిరోజు పరీక్షల్లో పలు ఘటనలు చోటుచేసుకోవటంతో శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలోనూ రెండో రోజు పరీక్షకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్ కాపీయింగ్కు పాల్పడేందుకే దుండగులు సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లు తొలగించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏలూరు త్రీటౌ న్ పోలీసులకు విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. చాటపర్రు రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాల పరీక్షా కేంద్రంలో మంగళవారం యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీఈవో
విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఎస్ గంగాభవానీ జెడ్పీ స్కూల్ను తనిఖీ చేశారు. పరిస్థితులపై ఉపాధ్యాయులు, స్థానికులను ఆరా తీశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు విచారణ చేస్తున్నారని డీఈవో చెప్పారు.