పల్లె చెరువు కాల్వలో అక్రమ నిర్మాణాలు

పల్లె చెరువు కాల్వలో అక్రమ నిర్మాణాలు

  • చెరువు నిండక ఆందోళనలో అన్నదాతలు

  • పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

  • మెదక్‌రూరల్‌:  పంట పొలాలకు సాగునీరందించే గొలుసు కాల్వను కొందరు కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో చెరువు నిండక పోగా ఆయకట్టు భూములకు నీరందక పంటలు పండకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మెదక్‌ మండల పరిధిలోని మంభోజిపల్లి గ్రామశివారులో గల పల్లె చెరువు  మొదటి విడత మిషన్‌ కాకతీయ పథకంలో ఎంపిక కావడంతో రూ.20లక్షలతో మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. కాగా మహబూబ్‌నహర్‌ కెనాల్‌ నుండి గోలుసు కాల్వ  ద్వారా ఈ చెరువులోకి నీరుచేరుతుంది.


    ఈ గోలుసు కాల్వ మాచవరం గ్రామం నడిమధ్యలో నుండి ఉండటంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గోలుసు కాల్వను కబ్జాచేసి దర్జాగా కాల్వలోనే పిల్లర్లువేసి మరీ ఇళ్లు కట్టుకట్టుకున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా కాల్వమూసుకుపోవడంతో చెరువులోకి నీరురావడంతో రాలేదు. ఫలితంగా పల్లె చెరువు ఆయకట్టు కింద గల సుమారు 160 ఎకరాల వ్యవసాయభూమి రైతులు సాగునీరందక పంటలు పండించలేక పోతున్నారు. అంతేకాకుండా అక్రమనిర్మాణాలు చేసిన ప్రాంతాల్లో పూర్తిగా మట్టి, చెత్తా చెదారంతో పూడుకుపోయింది. మరోవైపు చెత్తాచెదారం పేరుకు పోయి దుర్వాస వెదజల్లుతుండటంతో స్థానికప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


    ఇటీవల ఉపాధిహామి పథకంలో భాగంగా ఆ కాల్వలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఆ ప్రాంతంలో పూర్తిగా ఆ«ధ్వాన్నంగా ఉండటంతో పనులు చేయకుండా వదిలేశారు. గతంలో కూడా ఈ కాల్వల విషయమై మాచవరం, మంభోజిపల్లి గ్రామాల రైతులు, ప్రజలు పరస్పర దాడులు చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ సంఘటనలు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లినట్లుస్థానిక రైతులు చెబుతున్నారు.


    గోలుసు కాల్వ ఆక్రమణపై ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన పట్టించుకోకుండా నిర్లక్ష ్యపు సమాధానాలు చెబుతున్నారని పలువురు రైతులు, స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైన సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి గోలుసుకాల్వ ఆక్రమణపై చర్యలు తీసుకొని తమ పంటలు పండేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

     


     నీళ్లు వచ్చినప్పుడు భూమికోతకు గురవుతుంది:

    పల్లె చెరువుకు సంబంధించిన గోలుసులు కాల్వలోఅక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షపునీరు వచ్చినప్పుడు మా భూములుకోతకు గురవుతున్నాయి. మరోవైపు కాల్వలో చెత్తా చెదారం వేయడంతో తీవ్ర దుర్గందం వెదజల్లుతుంది. దీంతోపరిసరప్రాంతాల్లో ఉండలేకపోతున్నాం.

    దాసరి శ్రీధర్, మాచవరం

    అక్రమ నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థా దెబ్బతిన్నది:

    కాల్వలో అక్రమంగా నిర్మాణాలుచేపట్టడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైన అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలి.

    వాసు, మాచవరం

    చెరువులోకి నీళ్లువస్తేనే వ్యవసాయం:

    చెరువు ఆయకట్టు కింద నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చెరువులోకి నీళ్లు వస్తేనే పంటలు పండుతాయి. మాచవరం గ్రామంలో చెరువుకు సంబంధించి గోలుసు కాల్వలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో చెరువు నిండటంలేదు. దీంతో పంటలు పండటంలేదు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించాలి.

    గంజినర్సింలు, మంభోజిపల్లి

    కాల్వలో అక్రమ నిర్మాణంపై గతంలో గొడవలు జరిగాయి:

    కాల్వలో అక్రమ నిర్మాణాలపై గతంలో మంభోజిపల్లి, మాచవరం గ్రామాల రైతులకు గొడవలు జరిగాయి. కేసు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. కాని ఇరిగేషన్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమ నిర్మాణాలు తొలగించడంలేదు. ఈ చెరువు ఆధారపడే తాము బతుకుతున్నాం. అక్రమ నిర్మాణాలతో చెరువు నిండటం లేదు.

    బోల మల్లేశం, మంభోజిపల్లి

      

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top