ఎమ్మెల్యేలు పోయినా కేడర్ ఉంటుంది: లోకేశ్

ఎమ్మెల్యేలు పోయినా  కేడర్ ఉంటుంది: లోకేశ్ - Sakshi


- టీడీపీని కేసీఆర్ టార్గెట్ చేశారు

- మాది టెస్ట్ మ్యాచ్‌ల చరిత్ర

- టీ20లు ఆడే పరిస్థితి కాదు


 

సాక్షి, విజయవాడ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడినంత మాత్రాన కేడర్ ఎటూ పోదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం ఇక్కడి ఏపీ సీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయేనని, అందుకే సీఎం కేసీఆర్ తమ పార్టీని, నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా పార్టీది టెస్ట్ మ్యాచ్‌ల చరిత్ర. ఆ అనుభవం ఎక్కడికీ పోదు. మా పార్టీది టీ20లు ఆడే పరిస్థితి కాదు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడతామని తెలిసినా పోటీ చేశాం.

 

అయినా గతంలో కంటే టీడీపీకి లక్షన్నర ఓట్లు అదనంగా వచ్చాయి. గెలుపోటములు, సర్వేలు, లెక్కలు వేసుకుని యుద్ధంచేయడం రాజకీయం కాదు’’ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కుంగిపోబోమని, యువ రక్తంతో 2019 ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుని వెళ్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి లేదని, అవన్నీ అమలవాలంటే రూ.40 వేల కోట్లు కావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లోపు టీఆర్‌ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోతుందని జోస్యం చెప్పారు. కాపుల విషయంలో టీడీపీ చెబుతున్న విషయాలనే ఆ వర్గం నేత ముద్రగడ పద్మనాభం కూడా కోరుతున్నారన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top