రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు
- మార్కెట్ యార్డు కార్యదర్శి నారాయణమూర్తి
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్) : మార్కెట్యార్డుకొచ్చే రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసగించే చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కర్నూలు మార్కెట్యార్డు కార్యదర్శి నారాయణమూర్తి హెచ్చరించారు. గత గురువారం ఆలూరు మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు తెచ్చిన వాము పంట తూకంలో 7 కేజీలు తేడా రావడంతో సదరు వ్యాపారుల పై కేసులు నమోదు చేసి కాటాను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయంలో సంబంధిత వ్యాపారులతో తూకాల్లో జరుగుతున్న మోసాలు, ఇతర పరిణామాలు, రైతులు పడుతున్న ఇబ్బందులపై మాట్లాడారు. ఇదే తరహా చర్యలు పునరావృతమైతే సంబంధిత వ్యాపారుల లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. చిన్నహోతూరు రైతులను మోసం చేసిన వ్యాపారులపై చర్యల నిమిత్తం యార్డు చైర్పర్సన్ శమంతకమని సిఫారసు చేశామన్నారు. ఆమె ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంబంధిత వార్తలు