కట్టుకున్నవాడే కాలయముడై..

కట్టుకున్నవాడే కాలయముడై..


రోకలిబండతో మోది భార్యను

హతమార్చిన భర్త

మద్యం మత్తులో ఘాతుకం




కొండమల్లేపల్లి(దేవరకొండ) : కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో భార్యను రోకలిబండతో మోది హతమార్చాడు. హృదయవిదారక ఈ సంఘటన కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని చింతచెట్టుతండాకు చెందిన సరిత(27)కు  కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుడ్డోనితండాకు చెందిన ఇస్లావత్‌ రమేశ్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. ఇరువురు కూలి పనిచేస్తూ జీవనం సాగించేవారు. రమేశ్‌ మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగుతుండేవి. సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రమేశ్‌ భార్య సరిత(27)తో గొడవపడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరడంతో రమేశ్‌ మద్యం మత్తులో ఇంట్లో ఉన్న రోకలిబండతో సరిత తలపై బలంగా బాదాడు. తలకు బలమైన గాయం కావడంతో సరిత ఒక్కసారిగా అరిచింది. తండావాసులంతా అక్కడి చేరి రక్తపుమడుగులో చావుబతుకుల్లో ఉన్న సరితను  దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ శంకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.



అనాథలైన చిన్నారులు..

రమేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం తల్లి మృతిచెందడం, రమేశ్‌ జైలుపాలు కానుండడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఆడపిల్లలిద్దరూ పదేళ్లలోపు వారే కావడంతో వారి పరిస్థితి ఏంటని పలువురు కంటతడి పెట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top