ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం: ఎమ్మెల్యే రోజా
పుత్తూరు: అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీ నిర్ణయానికి కట్టుబడిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆమె సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ మంగళవారం జరిగిన పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీ కౌన్సిలర్లంతా ఏకతాటిపై నిలబడడంపై హర్షం వ్యక్తం చేశారు. తమకు పదవులపై వ్యామోహం లేదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును గౌరవించామన్నారు.
ఇదే ఒరవడిని కొనసాగించి అధికారపార్టీ సాగిస్తున్న ప్రజాకంఠక పాలనపై పోరాటం చేయాలని ఎమ్మెల్యే రోజా కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీదేనని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పెచ్చరిల్లుతున్న అధికార పార్టీ దారుణాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీకి త్వరలోనే చరమగీతం పాడతారన్నారు.