రాష్ట్రంలో హైఅలర్ట్!
పంజాబ్లో ఉగ్రవాదుల దాడితో అప్రమత్తమైన పోలీసులు
మావోయిస్టు వారోత్సవాలతో భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: పంజాబ్లోని గురుదాస్పూర్లో జరిగిన ఉగ్రవాదుల దాడితో రాష్ట్రంలోని పోలీసు విభాగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలపై నిఘా పెట్టింది. దేశంలో ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోందని తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నుంచి హెచ్చరికలు జారీ కావడంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేశాయి. అలాగే ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ ఉరితీత, మావోయిస్టుల సంస్మరణ సభల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదులు నలుగురు కూడా రాష్ట్రంలో తలదాచుకునే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
సంబంధిత వార్తలు