‘తూర్పు’న జోరుగా వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కోనసీమ, ఏజెన్సీతోపాటు మెట్ట ప్రాంతంలో సైతం వర్షం కురుస్తోంది. గడచిన మూడు రోజులుగా జిల్లాలో నిరంతరాయంగా జల్లులు పడుతూనే ఉన్నాయి.
మంగళవారం సాయంత్రం వరకూ జోరుగా వర్షం కురుసింది. మంగళవారం ఉదయం వరకూ జిల్లాలో సగటున 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జోరుగా కురుస్తున్న వర్షంతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవడం, కొన్నిచోట్ల జల్లులు పడుతూనే ఉండడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో మురుగునీరు రోడ్ల మీదకు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో శబరినదిలో వరద ఉధృతి పెరుగుతోంది. మెట్ట ప్రాంతంలో చెరువులకు జలకళ వచ్చింది. వర్షాలతో ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు.