కల నెరవేరుతుంది..
► పంచగుడి వంతెనతో రాకపోకలు మెరుగు
► రూ.108 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నాం
► రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల
► అర్లి వంతెన నిర్మాణానికీ నిధులు ఇస్తాం
► ఉమ్మడి జిల్లాలో రూ.2వేల కోట్లతో పనులు
► ముథోల్ నియోజకవర్గానికే.. రూ.367 కోట్లు
లోకేశ్వరం(ముథోల్): ‘‘ఏళ్ల క్రితం ఎస్సారెస్పీ కట్టకముందు గోదావరి నదికి అటువైపున ఇటువైపున ఉన్న వారంతా కలుసుకునేవారు. మళ్లీ ఇప్పుడు పంచగుడి వద్ద గోదావరిపై వంతెన నిర్మిస్తుండడంతో కలుసుకోనున్నారు. సీఎం కేసీఆర్ రూ.108 కోట్లు ఇచ్చి ఈ కల నెరవేరుస్తున్నారు’’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా గోదావరిలో నిర్మంచే రోడ్లు, వంతెన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
సమస్యల పరిష్కారానికే అధికారం కట్టబెట్టారు
గోదావరి నదిపై బాసర నుంచి భద్రాచలం వరకు ఖర్చుకు వెనక్కి రాకుండా సీఎం కేసీఆర్ 11 బ్రిడ్జిలను నిర్మించి నదికి ఇరువైపుల ఉన్న వారికి దూరభారం తగ్గిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసమే టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని అన్నారు. రోడ్లు భవనాల శాఖకు రాష్ట్ర బడ్జెట్లో రూ.6 వేల కోట్లు నిధులు కేటాయించారు. అయితే ఉమ్మడి జిల్లాకే ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో ముథోల్ నియోజకవర్గంలోనే రూ.367 కోట్లతో రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు.
అర్లి వంతెన నిర్మాణానికి రానున్న రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.ఉగాది నుంచి 24 గంటల కరెంట్ ఉగాది నుంచి వ్యవసాయానికి 24 గంటల త్రీఫేజ్ వి ద్యుత్ అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రతీ ఎకరాకూ సాగునీరు, ఇంటింటికీ నల్లా నీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు పంటలు పండించడానికి ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడిగా ఇస్తున్నామని వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ముం పునకు గురైన గ్రామ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పంచగుడి గ్రామ స మీపంలోని గోదావరి నదిపై నిర్మించే వంతెన నిర్మాణం కోసం రూ.108 కోట్ల నిధులు మంజూరు చేశామని వివరించారు.
ఈ సభలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీ నగేశ్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ ఇలంబరిది, ఆర్అండ్బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(ఈఎన్సీ) రవీందర్రావు, ఎస్ఈ నజీర్అహ్మద్, భైంసా డీఎస్పీ రాములు, ముథోల్ సీఐ రఘుపతి, ఎంపీడీవో సాయిరాం, తహసీల్దార్ లోకేశ్వర్రావు, జెడ్పీటీసీ శోభా బాయి, ఎంపీపీ కుంటాల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు అశోక్, సర్పంచ్ గంజాల జీవని, వంతెన కంట్రాక్టర్ సుధాకర్రెడ్డి, డీఈ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చిన్నారావు, వీడీసీ సభ్యులు భూమన్న, లింబారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.